Women Free Bus: కాంగ్రెస్ మార్క్ పాలన… మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటమే ఆలస్యం వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హమీలను నెరవేర్చడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9 వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి కావాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపింది. అయితే తెలంగాణలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి.. ఏ, ఏ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది అనే చర్చ మొదలైంది. కర్ణాటకలో అమలవుతున్న విధంగానే.. ఇక్కడా అమలు చేస్తారా అనే చర్చ జరుగుతోంది.
Also Read: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు… కేసీఆర్ పై ఏసీబీకి కంప్లయింట్
ఆధార్ కార్డ్ చూపిస్తేనే ఉచిత ప్రయాణం
ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అవుతోంది.. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు విధివిధానాలు పకడ్బందీగా రూపొందేవరకు మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పే అవకాశం ఉంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు కర్ణాటక తరహాలో కొన్ని నిబంధనలు తప్పేలా కనిపించడంలేదు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఫోటో గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్ చూపించినా సరే బస్సుల్లో ప్రయాణానికి అనుమతించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం శక్తి స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది.. సేవా సింధ్ వెబ్సైట్ ద్వారా మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇకపై మగవారికి రిజర్వ్ సీట్లు
ప్రతి బస్సులో ఉచిత ప్రయాణం ఉండదు.. కర్ణాటకకు చెందిన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కేవలం సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసుల వరకు మాత్రమే ఈ ఉచితం అమలు. కర్ణాటక ఆర్టీసీ బస్సులు వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు కూడా ఈ పథకం వర్తించదు. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలే బస్సు మొత్తం ఎక్కేందుకు వీలు ఉండదు. అందుకే బస్సులో మగవారి కోసం సీట్లు రిజర్వ్ చేస్తారు.. గతంలో మహిళలకు బస్సుల్లో కొన్ని సీట్లు కేటాయిస్తే.. ఇప్పుడు మగవారికి ఈ సౌకర్యాన్ని తీసుకొస్తారన్నమాట. కర్ణాటక మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేయాలనేమీ లేదు.. ఇక్కడా ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది.
Also Read: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ ప్రార్థన
తమిళనాడులో పింక్ బస్సులు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో తొలుత తమిళనాడు ప్రారంభించింది. అయితే కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లోనే ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ రంగు బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది.
జీరో టికెట్ జారీ
కర్ణాటక లో ప్రస్తుతం మహిళలకు జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే.. రూ.సున్నా ఉండే జీరో టికెట్ను జారీ చేస్తున్నారు. దీని ద్వారా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్కిస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెకిస్తారు. ఇక్కడ అదే పద్ధతిని అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
Also Read: జనసేనపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు.. పొలిటికల్ కాంట్రాక్టు కోసమేనంటూ ఎద్దేవా
రేవంత్ తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటకలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తోందని తెలుస్తుంది. అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం వంటి వివరాలను అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారట. అంతేకాదు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు కూడా సీఎం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది వంటి అంశాలపై క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ కర్ణాటక తరహాలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తుందా.. ఏవైనా మార్పులు ఉంటాయా అన్నది తేలనుంది.