![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-10.59.07-AM-780x470.jpeg)
Ayodhya: బాలరాముడికి రోజు గంటసేపు విశ్రాంతి
హిందువులందరి ఆరాధ్యదైవం, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఒక్క మనదేశం నుంచే కాదు, విదేశాల నుంచి సైతం రామ్లల్లా (బాలరాముడి) దర్శనం కోసం లక్షల సంఖ్యలో వస్తున్నారు. దీంతో అయోధ్యలో భారీగా రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే బాలరాముడి దర్శన వేళల్ని సైతం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పొడగించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తున్నారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉండేవి.
ALSO READ: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
అయితే, ఆలయ ట్రస్ట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాలరాముడి దర్శనానికి మధ్యాహ్నం పూట నిత్యం గంటపాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రతిరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని చెప్పింది. ‘అయోధ్య రామయ్య ఐదేళ్ల బాలుడు. అన్ని గంటల పాటు మెలకువగా ఉండటం వల్ల పడే ఒత్తిడిని తట్టుకోలేరు. అందువల్ల బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ గంట సేపు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. దీంతో ఆ దేవతామూర్తికి నిత్యం గంటపాటు విశ్రాంతి దొరుకుతుంది’ అని రామమందిర ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పష్టంచేశారు.