E-Mails: బెంగళూరులో బాంబు బెదిరింపులు.. 15 స్కూళ్లకు మెయిల్స్
కర్ణాటక రాజధాని బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఏకంగా 15 స్కూళ్లలో బాంబు పేలుళ్లు జరుపుతామని శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఈ- మెయిల్స్ పంపారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని పిల్లలను ఇంటికి పంపించేశారు. ఇక 15 స్కూళ్ల జాబితాలో మొదటి, ఏడో స్కూళ్లో బాంబులు వేస్తామని బెదిరించినట్టు సమాచారం.
Also read: Telangana: తెలంగాణకు మరో రికార్డ్.. దేశంలోనే నెం. 1
సిటీలోని.. బసవేశ్వర్ నగర్ నేపెల్, విద్యాశిల్ప పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న పాఠశాలకు కూడా బెదిరింపులు రావడం గమనార్హం. మరికాసేపటికి మరో ఏడు పాఠశాలలకు కూడా అలాంటి మెయిల్స్ రావడం స్థానికంగా కలకలం రేపింది. బాంబు బెదిరింపులు బూటకమని సంకేతాలు ఉన్నప్పటికీ.. బాంబు డిస్పోసల్ స్క్వాడ్లు ఆ ప్రాంగణంలో సోదాలు చేస్తున్నారు. బాంబులను గుర్తించినట్టు ఎలాంటి సమాచారం రాలేదు.