![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/clipboard0-horz.jpg)
Excise Department: మేడారం భక్తులకు ముఖ్య గమనిక.. ఇక ఆ వివరాలు ఉండాల్సిందే
మేడారం జాతరలో బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలు రూపొందించింది. ఆధార్ కార్డుతో పాటు బెల్లం కొనుగోలుదారులు ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, బెల్లం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలిపే పూర్తి వివరాలతో ప్రతిరోజు జిల్లా అధికారులకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి బెల్లం వ్యాపారులకు ఉత్తర్వులు అందాయి. మేడారం జాతర సందర్భంగా నెలకు 40 నుంచి 50 టన్నుల వ్యాపారం జరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ఇక్కడికి ఎక్కువగా బెల్లం రవాణా అవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మేడారం జాతర పేరుతో దాదాపు వెయ్యి టన్నుల బెల్లం వ్యాపారం సాగుతుందని అంచనా.
Also read: TS Government: తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్పులు.. నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా?
అక్కడి నుంచి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఎక్సైజ్ శాఖ బెల్లం విక్రయాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. జాతర సమీపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున బెల్లం తెప్పించి ఎక్కడికక్కడ హోల్ సేల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సమ్మక్క మొక్కులకు బంగారంగా కొంత బెల్లం, గుడుంబా తయారీకి కొందరికి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కొన్నిచోట్ల బెల్లం పట్టుబడిన ఘటనలు కూడా దందాకు నిదర్శనం. డిసెంబర్ 25 న నర్సంపేట- నెక్కొండ రహదారిలోని అమీన్ పేట వద్ద 15 క్వింటాళ్ల బెల్లంను పోలీసులు పట్టుకున్నారు. జనవరి 9న దత్తపల్లిలో 30 క్వింటాళ్ల బెల్లం, 50 కిలోల పటికను, 10న మరిపెడ మండల కేంద్రంలో 17 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. జనవరి 23న నర్సింహులపేట మండలం వంతడపాల స్టేజీ వద్ద కూడా 20 క్వింటాళ్ల బెల్లం పట్టుబడింది. బెల్లం దందా జోరుగా సాగుతున్నందునే ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.