K Keshava Rao: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా
రాజ్యసభ సభ్యత్వానికి బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిసిన ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించాలని ఆయన్ను కోరారు. కాగా బుధవారం ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కేకే రాజీనామాతో రాజ్యసభ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది. రాజ్యసభ ఎంపీగా ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే కేకే రాజీనామా చేయడం విశేషం.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానన్నారు. గత కొంత కాలంగా కేకే బీఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్ మీద గర్రుగా ఉన్నారు. పలుమార్లు కేకే కేసీఆర్ను బహిరంగంగానే విమర్శించారు. కేసీఆర్ అహంకారమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోడానికి కారణమని బహిరంగంగానే అన్నారు. అయితే బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, గురువారం ఎంపీ పదవికి రాజీనామా చేయడం విశేషం.
ఇంతకుముందు కేశవ రావు.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి కీలక పదవిలో కొనసాగారు. కేకే రాజీనామాపై గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారిన మరుసటి రోజే పదవికి రాజీనామా చేసి నైతిక విలువను చాటారని జీవన్ రెడ్డి కేకేను అభినందించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అనంతరం కేకే ఈ సాయంత్రం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకేను నియమిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన కేకే కాంగ్రెస్ లోనే పుట్టాను.. కాంగ్రెస్ లోనే చస్తాను అని తేల్చి చెప్పారు.