![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/photo-3-4-780x470.webp)
Medaram: మహాజాతరకు వేళాయె..
యావత్ తెలుగు ప్రజలు ఎంతో భక్తిపారవశ్యంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేడారం శ్రీ సమక్క- సారలమ్మ మహాజాతర ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వనదేవతల ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జాతర జరగనున్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం, మేడారం గ్రామం లక్షల మంది భక్తులతో కోలాహలంగా మారింది. ఇవాళ్టి నుంచి పౌర్ణమి దాకా, అంటే ఫిబ్రవరి 24 వరకు ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.
ALSO READ: మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు: తెలంగాణ ప్రభుత్వం
ఇవాళ గద్దెలపైకి సారలమ్మ
ఇవాళ (మొదటి రోజు) సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం నాలుగు గంటలకు మేడారంలో గద్దెలపై కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. రేపు (రెండో రోజు) చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఎల్లుండి (మూడో రోజు) ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్టదైవాలైన సమ్మక్క, సారలమ్మలకు ఎదురుకోళ్లు, పసుపు- కుంకుమ, కంకబియ్యం (ఒడిబియ్యం) వంటివి సమర్పిస్తుంటారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తారు. ఫిబ్రవరి 24న (నాలుగోరోజు) గంభీరమైన వన ప్రవేశం వేడుక పాటిస్తారు. ఆ రోజున దేవతలు తిరిగి అడవికి ప్రయాణం చేస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. కాగా.. దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ఈ జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది.