Medaram: మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు: తెలంగాణ ప్రభుత్వం
మేడారం జాతరకు ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జాతరకు ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇప్పటికే ప్రకటన చేసిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడపనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ బస్సులు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బయల్దేరతాయని అన్నారు.
ALSO READ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి శ్రీలీల
భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో బస్ పార్కింగ్, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, క్యాంటీన్, మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో గతంలో రెండు ప్యూరిఫైడ్వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, ఈసారి నాలుగింటిని ఏర్పాటు చేశామని చెప్పారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించామని తెలిపారు. కాగా.. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరగనున్న విషయం తెలిసిందే.