![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/test-1.jpg)
India Vs England: ఇంగ్లాండ్ పై భారత్ ఆధిక్యం.. మ్యాచ్ విజయంపై రోహిత్ సేన కన్ను
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా భారత్ ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టును 246 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 7 వికెట్లకు 421 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ సేన 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో 190 పరుగుల ఆధిక్యం లభించింది. పిచ్ పై బంతి స్పిన్ అవుతుండడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఎలా బ్యాటింగ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also read: Hyderabad: క్రికెట్ లో విధ్వంసం.. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ
మూడో రోజు ఆటలో భాగంగా అందరి దృష్టి జడేజా మీదే ఉంది. ఓవర్ నైట్ 81 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఈ స్టార్ ఆల్ రౌండర్ సెంచరీ కొడతాడని ఇండియన్ ఫ్యాన్స్ ఆశించారు. అయితే జడేజా మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు. తర్వాత బంతికే బుమ్రా గోల్డెన్ డకౌట్ అవగా.. చివరి వికెట్ గా అక్షర్ పటేల్ వెనుదిరిగారు. దీంతో 15 పరుగులకే భారత్ తమ చివరి మూడు వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 4 వికెట్లు తీసుకున్నాడు. రెహన్ అహ్మద్, హార్ట్లీ చెరో రెండు వికెట్లు దక్కగా.. లీచ్ కు ఒక వికెట్ లభించింది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే భారత బ్యాటర్లు జైస్వాల్ (80), రాహల్(86) సెంచరీలు మిస్ అయ్యారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ స్టోక్స్ 70 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి 15 ఓవర్లలో ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. 45 పరుగుల వద్ద క్రాలీ (33) అశ్విన్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బెన్ డకెట్ (38), ఒల్లీ పోప్ (16) క్రీజులో ఉన్నారు.