TSRTC: సంక్రాంతి పండక్కి బెంగ అక్కర్లేదు.. ఆర్టీసీ బస్సుల సమ్మె విరమణ
సంక్రాంతి పండుగకు బెంగక్కర్లేదు. ఆర్టీసీ బస్సుల సమ్మెతో ఊర్లకు ఎలా వెళ్లాలనే ఆందోళన ఇక అవసరం లేదు. తెలంగాణ ఆర్టీసీ అధికారులు అద్దె బస్సు యజమానులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి వారం రోజుల గడువు అడగడంతో అద్దె బస్సు యజమానులు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో సంక్రాంతి పండుగకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. ఆదిలాబాద్ జిల్లాలో ‘కారు ఖాళీ‘
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేస్తుండడంతో అద్దె బస్సు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణీకుల రద్దీతో ఆదాయం కోల్పోవడంతో పాటు బస్సుల ఫిట్ నెస్ దెబ్బతింటుందని బస్సు యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ణప్తి చేస్తున్నా పట్టించుకోకపోవడంతో శుక్రవారం నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.
సమ్మె ప్రకటనతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రంగంలోకి దిగారు. వెంటనే అద్దె బస్సు యజమానులతో గురువారం సమావేశమై చర్చలు జరిపారు. వారి సమస్యలు విన్న సజ్జనార్ వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం ఒక కమిటీని కూడా వేస్తామని ప్రకటించారు. దీంతో యజమానులు వెనక్కి తగ్గి సమ్మె ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడిపిస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు.
Also Read కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్.. ఏపీ నుంచి ప్రత్యేకంగా రాక
ఐదు ప్రధాన సమస్యలను ఆర్టీసీ ముందు ఉంచామని అద్దె బస్సుల యజమానులు తెలిపారు. ఈనెల 10వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్టీసీ హామీతో శుక్రవారం నుంచి చేపట్టాల్సిన సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.