CM Jagan: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ సంకల్పం
ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్కు వ్యతిరేక ఓటు ఎక్కడా లేదని, ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. జగన్ అందిస్తున్న పథకాలను చూశాక చంద్రబాబు ఎంత దోచుకు తిన్నారో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన విమర్శించారు. పేదవారికి అండగా, నిరుపేదలకు తోడుగా ఉండాలన్నదే జగన్ సంకల్పమని చెప్పారు.
ఆరోగ్యం, విద్యపై అధిక ప్రాధాన్యత
సీఎం జగన్ విద్య, వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కార్పొరేట్ వైద్యం పేదప్రజలకు సైతం అందాలన లక్ష్యంతో ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విమర్శకులు సైతం జగనన్న ఆరోగ్య సరళిని, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల తీరును అభినందించారు. సురక్ష క్యాంప్ ద్వారా పేదలకు అన్నిరకాల వైద్యసేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి మెరుగైన చికిత్సలకు సిఫార్సు చేయించేలా వైద్య చరిత్రలో మార్పులు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరమనేలా ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
జగన్ హయాంలో బీసీలకు పదవులు
ఎస్సీలు, బీసీలను చంద్రబాబు బానిసలుగా చూసేవారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు దృష్టిలో బీసీలంటే ఓట్లు వేసేవాళ్లు మాత్రమేనని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాగానే టీడీపీలో అచ్చెన్నాయుడిని పక్కకి తోసేశారని ఎద్దేవా చేశారు. కానీ జగన్ హయాంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించడంతోపాటు ఆ వర్గానికి మంత్రి పదవులు సైతం ఇచ్చారని గుర్తు చేశారు.