Assembly : హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు… రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంత బాగా పనిచేసిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్ని గంటలు సమయం ఇచ్చినా హరీష్ రావుకు సరిపోలేదని.. అబద్ధం చెప్పడంలో హరీశ్కు మేనమామ సాలు వచ్చిందన్నారు.
Also Read: కాంగ్రెస్ శ్వేతపత్రంపై బీఆర్ఎస్ కౌంటర్
తనకు మంత్రి పదవి ఇవ్వరని హరీశ్ రావు అన్నారని.. తనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది అదిష్టానం చూసుకుంటుందన్నారు. కానీ, హరీశ్ రావును..తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు వాడుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతాడు కాని.. హరీశ్ రావు కాడన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. దీంతో సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
Also Read: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల.. అప్పు ఎంత ఉందంటే?
హరీశ్ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. తన వ్యాఖ్యలను హరీశ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే… తన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటానని హరీశ్ చెప్పారు. మరోవైపు, హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సూచించారు. అయినా హరీశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.