Armoor: బిల్లు కడుతారా.. మాల్ మూసేయాల్నా? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక
అధికారం ఉందని రెచ్చిపోయిన వారికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం బుద్ధి చెబుతోంది. ఒక్కొక్కరి అవినీతి, అక్రమాల చిట్టా బయటపడుతోంది. తాజాగా కేసీఆర్ (KCR)కు ముఖ్య అనుచరుడు, ఆర్మూర్ (Armoor) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ (TSRTC) భారీ షాక్ ఇచ్చింది. లీజుకు తీసుకున్న స్థలం విషయమై చివరి నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే మాల్ ను మూసివేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామం నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) కలకలం రేపింది. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆందోళనలో పార్టీ నాయకులు
ఆర్మూర్ లో బస్టాండ్ కు ఆనుకుని ఆర్టీసికి చెందిన 7 వేల చదరపు గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు 33 ఏళ్ల లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఆ స్థలంలో కొన్నేళ్ల కిందట జీ-1 (జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్) పేరిట భారీ భవనం నిర్మించారు. అందులో వివిధ షాపింగ్ దుకాణాలు, సినిమా హాళ్లు నిర్మించారు. ఆర్మూర్ కు మల్టీప్లెక్స్ (Multiplex) షాపింగ్ మాల్ అందుబాటులో వచ్చింది. అయితే ఈ స్థలానికి చెల్లించాల్సిన అద్దె మాత్రం చెల్లించడం లేదు.
ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరింది. బకాయిలు చెల్లించాలని తరచూ నోటీసులు పంపిస్తున్నా స్పందన లేదు. దీంతో గురువారం ఆర్టీసీ సిబ్బంది వెళ్లి మైక్ లో లీజు బకాయిలకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. వెంటనే బకాయిలు (Dues) చెల్లించకపోతే స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించరు. కాగా, ఈ భవనం విద్యుత్ బకాయిలు కూడా భారీగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నోటీసులు పంపుతున్నా స్పందించకపోవడంతో ఈ చర్యలకు దిగామని ఆర్టీసీ, విద్యుత్ అధికారులు తెలిపారు.
Also Read: ఎవరూ నిరాశకు గురికావద్దు… ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్
ఈ వ్యవహారంపై ఇప్పటివరకు తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) స్పందించలేదు. కాగా, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జీవన్ రెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మారగానే ఇలా నోటీసులు (Notice) వచ్చాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.