![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/revanth-1.jpg)
CM Revanth Reddy: ఏపీపై సీఎం రేవంత్ ఫోకస్.. ఇరకాటంలో పడనున్న జగన్?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు, మూడు నెలలు సమయమున్నా.. ఆ ఊపు మాత్రం ఇప్పుడే కనిపిస్తోంది. ఇక ఏపీలో ఓ ఆసక్తికర విషయం బయటపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించారో.. ఇప్పుడు ఎపీలో కాంగ్రెస్ ను బలపరిచేందుకు సీఎం రేవంత్ నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం.
Also read: Arvind Panagariya: రాష్ట్రపతి ముర్ము కీలక నిర్ణయం.. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా అరవింద్ పనగఢియా
ఇక తాజాగా.. వైసిపిలో కొందరు నేతలు, ఎమ్మెల్యేలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాల నేపథ్యంలో వారిని తమవైపు తిప్పుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకే రేవంత్ దూత ఒకరు వైసిపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. కాంగ్రెస్ చేరేందుకు పలు ఆఫర్లను కూడా ఇస్తున్నారట. హైదరాబాద్ లోని వారి ఆస్తులు పదిలం చేయడంతోపాట.. వారి వ్యాపార వ్యవహారాల్లో సహకారం కూడా అందిస్తామని వారిని వలలో వేసుకునే పనిలో పడ్డారట.
ఇక రాష్ట్రంలో మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా వైసిపి అధినేత జగన్ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలను మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో టికెట్లు దక్కని, పలువురు అసంతృప్త నేతలు సుమారు 40 మందిని తమవైపు తిప్పుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే వైసిపి ఓట్లు చీలే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతిమంగా ఇది తెలుగుదేశం పార్టీకి లాభంగా చేకూర్చేలా ఉంది. ఎలాగో 2024లో మోడీకి సీట్లు తగ్గుతాయని.. ఇక 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అప్పుడు పార్టీలో ఉంటే ఆ నేతలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారట.
మరోవైపు వైసిపి నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తే.. అది వైసిపి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం వైఎస్ షర్మిలకు ఏపీ బాధ్యతలను అప్పగించనున్నారనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం బాగా కలిసిరానుంది. మరి చూడాలి ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు బలపడనుందో.