![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/assembly-2.jpg)
Telangana Assembly: వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ.. అధికార, విపక్షాల మాటల యుద్ధం
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చేశారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్, సీపీఐ, ఏఐఎం ఎమ్మెల్యేలు సందర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆహ్వానించారు. మేడిగడ్డ నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ హాజరుకాలేదు. కాగా బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది.
Also read: Congress: రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్.. నలుగురు సభ్యుల నామినేట్
ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 18 మంది మంది సభ్యులు ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మంది మాత్రమే ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రూలింగ్ జారీ చేశారు. బడ్జెట్ చర్చలో బీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరి పాల్గొన్నారు. బడ్జెట్పై ఎవరు సమాధానం చెబుతారని కడియం ప్రశ్నించారు.
కొన్ని కారణాల వల్ల ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభకు హాజరుకాలేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. బడ్జెట్ చర్చపై ప్రభుత్వం సీరియస్ గా లేదని స్పష్టమవుతోందని కడియం శ్రీహరి అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన, సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేయగా, సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ భాష సరైనదేనా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మనం దాని గురించి చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు. ఇదేనా తెలంగాణ సంప్రదాయం? అని నిలదీశారు.
గుంతలో పడిపోయిన బీఆర్ఎస్కు బుద్ది రాలేదు. చర్చకు రావాలంటే పారిపోయారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం తీరును నిరసిస్తూ వారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్కు ఆసక్తి లేదు. సభ నుంచి ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా విమర్శించారు.