TS Government: అణిచివేత సహించరు.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు అణిచివేత, అప్రజాస్వామిక పోకడలను సహించరని అన్నారు. పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారన్నారు. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రస్తుతం నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందని చెప్పారు.
ALSO READ: ప్రజాభవన్ కు భారీగా క్యూ కట్టిన ప్రజలు.. సమస్యలపై ఫిర్యాదులు
ఇనుప కంచెలు తొలగిపోయాయి
ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోందని తెలిపారు. బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలన్నారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చిందని గవర్నర్ అన్నారు. పౌర హక్కులు, ప్రజా హక్కులకు నాంది పడిందని తెలిపారు. కాగా, పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నా అని, ప్రజా సేవకులే తప్ప పెత్తందార్లు కాదని గవర్నర్ గుర్తు చేశారు. అదే విధంగా 6 నెలల్లో మెగా డీఎస్సీ, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన, ఏడాదిలోగా 2 లక్షల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.