![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/tsrtc.jpg)
TSRTC: ప్రయాణికుల కష్టాలకు చెక్.. ఆర్టీసీకి మరిన్ని కొత్త బస్సులు
తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజుకు 12 లక్షల మంది మహిళలు మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరడంతో.. బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో గతంలో 4.50 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించగా, ఇప్పుడు వారి సంఖ్య డబులైంది. పురుషులే కాదు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు కూడా బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. అయితే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.
Also read: AP Government: పరిశ్రమలకు ప్రభుత్వం ఊతం.. ఫార్మాహబ్ గా ఏపీ
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. నగరంలో త్వరలో 500 ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల, మార్చి నుంచి కొన్ని బస్సులు రాకపోకలు ప్రారంభమవుతాయని గ్రేటర్ జోన్ అధికారులు వెల్లడిస్తున్నారు. జూన్, జూలై నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయని అధికారులు చెప్తున్నారు. త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులతో ప్రయాణికులకు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. అయితే కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదని వెల్లడించారు. అలాగే పాస్ తీసుకున్న విద్యార్థులకు, జనరల్ పాస్ తీసుకున్న వారికి కూడా ఈ బస్సులను కేటాయించే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో అందుబాటులోకి వస్తే.. కొన్ని కాలేజీలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.