Air Pollution: కాలుష్యంలో కూరుకుపోతున్న భారత్.. లాన్సెట్ నివేదికలో సంచలన నిజాలు
భారత్ కాలుష్య కొరల్లో కొట్టుమిట్టాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా 11.5 శాతం మరణాలు వాయు కాలుష్యంతోనే సంభవించి ఉండవచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్ లో ప్రచురితమైన ఓ రిపోర్టు అంచనా వేసింది. భారత్ లో మొత్తం 10 నగరాలు అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం నిర్వహించారు. ప్రతి ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మంది కాలుష్యంతో మరణిస్తున్నట్లు నివేదిక తెలిపింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. ఇది అక్కడ సంభవిస్తున్న మరణాల్లో 3.7 శాతానికి సమానం. మొత్తం 10 నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం కాలుష్యం వల్లే అని నివేదిక కుండబద్దలు కొట్టింది.
Read also: INDIAN RAILWAY: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న రైల్వే.. తాజాగా మరికొన్ని రైళ్లు రద్దు
భారత్ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. 10 నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని నివేదిక వెల్లడించింది. ఏడాదిలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. 2008 నుంచి 2019 మధ్య కాలంలో పది నగరాల్లో సివిల్ రిజిస్ట్రిల నుంచి మరణాల సమాచారాన్ని సేకరించారు. నగరాన్ని బట్టి 3 నుంచి 7 ఏళ్ల డేటా మాత్రమే వారికి లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను అధ్యయనం చేశారు. మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించిన లేటెస్ట్ టెక్నాలజీతో పీఎం 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు.
ఈ పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికంగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. 10 నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే.. బెంగళూరులో అది 3.06 శాతం పెరిగినట్లు తెలిపింది. పీఎం 2.5 స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోల్చితే తక్కువగా ఉన్న వాటిల్లోనే మరణాలు అధికమవుతున్నట్లు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ కు చెందిన సిధ్థార్థ్ మండల్ పేర్కొన్నారు.