![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/KTR-2.gif)
TS: మల్లేశ్ హత్య కేసు కాంగ్రెస్ తప్పించుకునే యత్నం: కేటీఆర్ విమర్శలు
అధికార కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హత్యా రాజకీయాల సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై తటస్థ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Also Read: మసీదుల కోసం పోరాడితే అల్లా సహాయం చేస్తాడు: అసదుద్దీన్
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, మాజీ సైనికుడు మల్లేశ్ ఇటీవల హత్యకు గురయ్యాడు. మల్లేశ్ హత్య వార్త రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు ఈ హత్యకు పాల్పడ్డారని సమాచారం. దీంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మల్లేశ్ కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తోంది.
Also Read ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు… పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా
ఈ క్రమంలోనే పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం కేటీఆర్ అందించారు. గంట్రావుపల్లిలో బాధిత కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించారు. మీకు మేం అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మల్లేశ్ హత్య రాజకీయ హత్య. కానీ పొలం పంచాయితీ పేరుతో కేసు నుంచి కొందరు తప్పించుకుంటున్నారని బాధితుడి భార్య నిర్మల చెప్పారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కార్యకర్తలను సమిధలుగా చేసే సంస్కృతి మంచిది కాదని మంత్రి జూపల్లి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతున్నా’ అని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై భౌతిక దాడులకు దిగలేదు అని స్పష్టం చేశారు. మల్లేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.