Fire Accident: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగి ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఈస్ట్ ఢిల్లీలోని శాస్త్రీనగర్ లో నాలుగు అంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్థలంలో మంటలు అంటుకుని పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో బిల్డింగ్ మొత్తం భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
Also read: Patna Court: పాట్నా కోర్టులో పేలుడు.. ఇద్దరు మృతి
ప్రమాదంలో ఓ కారు, బైకులు కాలిపోయాయి. పొగతో ఊపిరాడక ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతులను మనోజ్ (30), సుమన (28) ఐదేళ్ల బాలికలు ఇద్దరిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.