![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/test.jpg)
India Vs England: ముగిసిన తొలిరోజు ఆట.. రాణించిన సర్ఫరాజ్ ఖాన్
భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగ్రేట మ్యాచ్లోనే అదరగొట్టాడు. అవకాశాల కోసం ఎదురుచూసి అలసిపోయిన ఈ యువ కెరటం ఆ కోపాన్ని ఇంగ్లాండ్ బౌలర్లపై చూపించాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అర్ధ శతకంతో రాణించాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగులను పూర్తి చేశాడు. చివరికి 66 బంతుల్లో 62 పరుగులతో రనౌట్ గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ బ్యాటింగ్ చూస్తే వన్డే, టీ20 మ్యాచ్ చూసినట్టు అనిపించింది.
Also read: BCCI: రోహిత్ సారథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ సిరీస్.. ప్రకటించిన బీసీసీఐ
సహచర క్రికెటర్లు ఆచి తూచి ఆడుతూ పరుగులు చేస్తుంటే.. సర్ఫరాజ్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. బంతి ఏమాత్రం దూరం పడినా.. దాన్ని బౌండరీకి తరలించాడు. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీకి చేరువకాగానే అతని తండ్రి నౌషాద్ ఖాన్, భార్య రొమానా జహూర్ చప్పట్లతో ఆనందాన్ని చాటుకున్నారు. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ టెస్ట్ క్యాప్ అందుకున్నప్పుడు అతని తండ్రి నౌషాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఈ అవకాశం కోసం రెండేళ్లు ఎదురుచూశాడు.
ఇక రాజ్ కోట్ వేదికగా సాగుతున్న భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ప్రారంభంలోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ జడేజా మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ 196 బంతుల్లో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా సర్ఫరాజ్ ఖాన్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆటముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) క్రీజులో ఉన్నారు.