![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/metro-780x470.jpg)
Congress: మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లె మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలో మీటర్ల దూరం ఉంటుందని… ఈ క్రమంలో ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు.
Also Read: గవర్నర్ ను కలిసిన రేవంత్ రెడ్డి… కీలక విషయాలపై చర్చ
మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. గచ్చిబౌలి నుంచి మెట్రోలో విమానాశ్రయానికి వెళ్లే వారు దాదాపు ఉండరని పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో మార్గానికి లింక్ చేస్తామన్నారు. ఫార్మా సిటీని రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లుగా మారుస్తామన్నారు.
Also Read: టీడీపీ భారీ స్కెచ్.. అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు!
గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం చెప్పారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం.. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ ను భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.