![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/07/CMS-780x470.png)
Meeting: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ… అందరిలోనూ ఉత్కంఠ!
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనుంది. ఈ భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన, ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు విలీన గ్రామాలను.. ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం.
అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల భేటీ రేవంత్ రెడ్డి కి కత్తిమీద సాములాంటిదని కీలక వ్యాఖ్యలు చేశారు. తేడావస్తే తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి పై ముద్ర వేస్తారని గుర్తు చేశారు. దానికి రేవంత్ రెడ్డి భయపడాల్సిన పని లేదన్నారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు తప్పా.. వారి మధ్య వైషమ్యాలు లేవన్నారు.
కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు . మరోవైపు నేడు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు . ఇక, రేపు ప్రజా భవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. అయితే, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
2 Comments