![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/తెలంగాణ.jpeg)
Telangana: రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్… రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు కాగా, ముగ్గురిని ఎలక్షన్ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది.
Also Read: పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి రెడీ
ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. కాగా వారి నామినేషన్లను ఈసీ తిరస్కరించింది. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లపై 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ మిగిలిన ముగ్గురికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయలేదు. దీంతో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఇద్దరు కాంగ్రెస్, ఒక బిఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Also Read: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహ.. ఉనికి కోసమేనా?
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ గన్పార్క్లోని అమలరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన కేసీఆర్కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో గళమెత్తుతానని, ఖమ్మంలో బీఆర్ఎస్కు పునర్వైభవం తీసుకొస్తానని తెలిపారు.
Also Read: హస్తినలో ఉద్రిక్త పరిస్థితులు
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనిల్కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా గాంధీభవన్కు చేరుకున్నారు. తెలంగాణ నుంచి బీసీ బిడ్డను రాజ్యసభకు పంపడం బీసీలకు గర్వకారణమన్నారు. చిన్న వయసులోనే అధిష్ఠానం తనకు పెద్ద పదవి ఇచ్చిందని, ఇది తన జీవితంలోనే గొప్ప సంఘటన అని పేర్కొన్నారు.
Also Read: టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకాలు పూర్తి.. త్వరలో అధికారిక ప్రకటన?
వీరి పదవీ కాలం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానుంది. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సభ్యులు సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది. అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా రెండు కాంగ్రెస్కు, ఒకటి బీఆర్ఎస్కు దక్కాయి.