Farmer Protests: హస్తినలో ఉద్రిక్త పరిస్థితులు
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటలకు కనీస మద్దతు ధర పెంపు విషయంలో ఇటీవల కేంద్రం చేసిన సిఫార్సులను వ్యతిరేకించిన రైతు సంఘాల నేతలు మరోసారి ‘ఢిల్లీ చలో’ పేరుతో హస్తిన బాట పడుతున్నారు. పంజాబ్, హర్యానా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి రైతులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 1200 ట్రాక్టర్లలో పద్నాలుగు వేల మంది రైతులు బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను తీసుకొని ఆందోళనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని శివారు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ALSO READ: హిమాచల్ ప్రదేశ్ లో భారీగా హిమపాతం.. ప్రజల ఇబ్బందులు
నాలుగు సార్లు.. ఫలించని చర్చలు
వ్యవసాయ రంగంలో ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన సూచనలను పాటించాలని, పంటలకు మద్దతు ధరలపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, యూపీ, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 200 సంఘాల రైతులు ఫిబ్రవరి 13 నుంచి ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8, 12, 15వ తేదీల్లో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు మూడు విడతలుగా చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి. చివరగా 18వ తేదీన (ఆదివారం) రాత్రి నాలుగో విడత చర్చలు జరిపినా, అవి కూడా సఫలం కాలేదు. దీంతో రైతు సంఘాలు మరోసారి ఆందోళనలకు సిద్ధమయ్యాయి.