Dhoni: ఐపీఎల్-2024 సర్వత్రా ఉత్కంఠ.. ధోనీ బ్యాట్ పై చర్చ
ఐపీఎల్ 2024 మార్చి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్ను బీసీసీఐ ఇంకా రిలీజ్ చేయలేదుకానీ.. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ను రిలీజ్ చేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే తన ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ఇటీవల రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించిన మహీ.. ఐపీఎల్ 2024 కోసం సాధన ఆరంభించాడు. ధోనీ ప్రాక్టీస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ప్రాక్టీస్ లో ధోనీ వాడిన బ్యాట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
Also read: Jack Leach: భారత్ తో ఇంగ్లాండ్ టెస్ట్.. సిరీస్ నుంచి స్టార్ స్పిన్నర్ ఔట్
ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 సందర్భంగా కామెంట్రీ బాక్స్లోని వ్యాఖ్యాతలు ఎంఎస్ ధోనీ బ్యాట్ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్క్రిస్ట్, మైకెల్ హస్సీ ఐపీఎల్ 2024 గురించి చర్చించారు. ‘ఐపీఎల్ ఆరంభానికి 10 రోజుల ముందు భారత్కు వెళ్తా. ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లు తలపడతారు. భారత యువ క్రికెటర్లకూ మంచి అవకాశం. మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తారు. వారు చేసే సందడి అద్భుతంగా ఉంటుంది. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. నెట్స్లో ఇప్పటికే సాధన మొదలెట్టాడు’ అని హస్సీ అన్నాడు.
మైకెల్ హస్సీ వ్యాఖ్యలపై ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందించాడు. ‘అవును.. నెట్స్లో ఎంఎస్ ధోనీ సాధన చేయడం నేను చూశా. మహీ వాడిన కొత్త బ్యాట్పై స్టిక్కర్లను గమనించా. అవి స్థానికంగా ఉండే స్పోర్ట్స్ స్టోర్కు సంబంధించినది. ధోనీ చిన్ననాటి స్నేహితుడు ఆ షాప్ను నిర్వహిస్తున్నాడు. అమ్మకాలను పెంచేందుకు తనవంతు సాయంగా ధోనీ ఆ స్టిక్కర్లను తన బ్యాట్పై అతికించాడు’ అని గిల్క్రిస్ట్ పేరొకొన్నాడు. ‘ప్రైమ్ స్పోర్ట్స్’ అని రాసి ఉన్న స్టిక్కర్ను ధోనీ బ్యాట్పై అతికించాడు. మహీ చిన్ననాటి స్నేహితుడు పరమజిత్ సింగ్కు చెందిన స్పోర్ట్స్ కంపెనీ అది. బీఏఎస్, ఎస్ఎస్, రీబాక్, టీఓఎన్, స్పార్టన్ స్టిక్కర్లను ధోనీ గతంలో తన బ్యాట్పై అతికించాడు.