![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/kishan-reddy-bjp-780x470.webp)
BJP: నేడు బీజేపీ ఎన్నికల శంఖారావం.. ప్రచార రథాలను ప్రారంభించనున్న కిషన్ రెడ్డి
తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది, సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో కనీసం పది లోక్సభ స్థానాలు, 35 శాతం ఓటుబ్యాంకు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కిషన్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించనున్నారు.
ALSO READ: రైతు సంఘాలతో ముగిసిన చర్చలు.. నిరసనలు ఆపేసినట్టేనా?
17 లోక్సభ నియోజకవర్గాలు.. 5 క్లస్టర్లు
గత లోక్సభ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి కనీసం 10 స్థానాల్లో గెలుపొందేలా ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 17 లోక్సభ నియోజక వర్గాలను 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారం చేపట్టనున్నారు. ఆ ఐదు క్లస్టర్లలో మొత్తం 4 వేల 238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు, మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు పాల్గొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. బస్సుయాత్రల్లో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ.. రాష్ట్రానికి సంబంధించి పదేళ్లలో కేంద్రం చేసిన సహకారాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు.