KCR Request: ప్రజలకు గద్గద స్వరంతో కేసీఆర్ విజ్ణప్తి
కొన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో (Hospital) చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR)ను పరామర్శించేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు తరలివస్తుండడంతో యశోద ఆస్పత్రి (Yashoda Hospital) వద్ద పరిస్థితి అదుపు తప్పుతోంది. హైదరాబాద్ (Hyderabad) సోమాజిగూడలోని ఆస్పత్రికి ప్రజల తాకిడి పెరగడంతో ఉద్రిక్తతకు దారి తీస్తోంది. దీనికితోడు అధిక సంఖ్యలో ప్రజల రాకపోకలతో ఆస్పత్రిలోని మిగతా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వీడియో ద్వారా ఓ సందేశం వినిపించారు. తనను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని కోరారు.
చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
కేసీఆర్ సందేశం
‘ఈరోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ (Fans and Supporters) హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగిన ప్రమాదంతో యశోద ఆస్పత్రిలో చేరాను. వైద్య బృందం (Doctors) నన్ను ఒక హెచ్చరించింది. నాకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. దాంతో చాలా అవస్థలు ఎదుర్కొంటారు.. నెలల తరబడి కోలుకోలేరని చెప్పారు. దీనిని గమనించిన మీ అభిమానానికి నేను వెయ్యి చేతులు ఎత్తి దండం (Request) పెడుతున్నా. మీరందరూ కూడా బాధపడకుండా మీ మీ స్వస్థలాలకు తిరిగి వెళ్లండి. కనీసం పది రోజుల వరకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దు. ఆస్పత్రిలో ఇతర రోగులు కూడా ఉన్నారు. వారి క్షేమం (Safety) కూడా మనకు ముఖ్యం. అన్యథా భావించకుండా క్రమశిక్షణ (Discipline) పాటించి తిరిగి మీ ఇళ్లకు క్షేమంగా చేరండి. నేను తిరిగి కోలుకున్నాక తప్పకుండా కలుసుకుందాం. రోజు ప్రజల మధ్యనే ఉంటా. ఆస్పత్రి వద్ద ఇతర రోగులు, ప్రజలు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అందరూ వెళ్లిపోండి. నా మాటను (Words) మన్నించి.. గౌరవించి ఏమాత్రం గొడవ లేకుండా అందరూ తిరిగి వెళ్లాలని విజ్ణప్తి చేస్తున్నా’ అని కేసీఆర్ సందేశం ఇచ్చారు. ఈ వీడియోను యశోద ఆస్పత్రి విడుదల చేసింది. కేసీఆర్ చేసిన విజ్ణప్తితో ఆస్పత్రికి తరలివచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు.
చదవండి: ఈ ఒక్క విషయంలో జగన్ మారితే సూపర్ సక్సెస్