Nizamabad: అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నికలు జరగనున్నాయా?
సైబర్ మోసగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా వీరి వేధింపులతో నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నిజామాబాద్ నగరం ఉలిక్కి పడింది. నగరంలోని గాయత్రినగర్లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
Read also: Kavitha: కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. ఆగమాగమైన బీఆర్ఎస్ శ్రేణులు
కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు.
రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కన్నయ్య మృతితో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.