CM Revanth: ప్రజాపాలనపై సీఎం సమీక్ష.. రైతుబంధు, పింఛన్లపై ప్రకటన
రైతుబంధు, పింఛన్లపై ప్రజలకు అపోహాలు అవసరం లేదని.. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also read: Minister Ponnam Prabhakar: ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు.. కొత్త బస్సులు ప్రారంభం
పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
మరోవైపు ప్రజా పాలనలో రెండ్రోజుల్లోనే 16 లక్షల 60వేల దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం, సోమవారం న్యూ ఇయర్ సందర్భంగా సెలవులు రావడంతో దరఖాస్తుల స్వీకరణ బ్రేక్ పడింది. తిరిగి జనవరి 2వ తేదీ నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు.