TS Government: స్మితా సబర్వాల్ ఔట్.. ఆమ్రపాలి ఇన్!
ప్రభుత్వంలో కొత్త టీమ్పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఆమ్రపాలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ALSO READ: టీఎస్పీఎస్సీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష… ప్రక్షాళనకు ఆదేశం
సమీక్షలకు దూరంగా స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా మాజీ సీఎం కేసీఆర్ నియమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సీఎంఓ ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, మిషన్ భగీరథ పనులనే సైతం స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. కాగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఒక్క సమీక్షకు కూడా స్మితా సబర్వాల్ హాజరు కాకపోవడం గమనార్హం. తాజాగా, స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఛాలెంజ్కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ALSO READ: తవ్వుతున్న కొద్దీ అప్పులు.. బండెడు భారం మోపిన కేసీఆర్
డైనమిక్ ఆఫీసర్గా ఆమ్రపాలి..
డైనమిక్ ఆఫీసర్గా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి రేవంత్ టీంలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమె డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం ఆమ్రపాలి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీ కేడర్కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. తనదైన పనితీరుతో డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా ఆమ్రపాలి పనిచేసిన ఆమె.. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో పీఎంఓలో డిప్యూటీ కార్యదర్శిగా చేరిన సంగతి తెలిసిందే. కాగా, ఆమెకు రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉందని సమాచారం.