Chandrababu: తెలంగాణలో హస్తం హవా.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉండగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందేశం అంటూ ఈ సమాచారాన్ని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Also read: BRS: తెలంగాణలో సాగుతున్న ఓట్ల లెక్కింపు.. మంత్రులు వెనుకంజ
తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల నిర్ణయం, దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలని పేర్కొన్నారు. ఫలితాలు చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయం మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను ఎద్దేవా చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం, 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించామని ఇప్పుడు తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దామని పేర్కొన్నారు. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదామంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు.