Tamilisai అదంతా తప్పు.. నేను రాజీనామా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దికాలంగా తనపై జరుగుతున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. జరుగుతున్న ప్రచారమంతా తప్పు అని స్పష్టం చేశారు. తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని.. గవర్నర్ గానే కొనసాగుతానని చెప్పారు.
Also Read గ్యారంటీలు అమలు చేస్తారా? లేదా? ఎమ్మెల్సీ కవిత నిలదీత
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ చేస్తున్నారని.. ఈ సందర్భంగా గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నారని కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను కలిసినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శనివారం తమిళిసై స్పందించారు. సికింద్రాబాద్ లో అయోధ్య ఆలయ తలుపులు తయారుచేసిన అనురాధ టింబర్ ను గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు’ అని కొట్టిపారేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా రాజీనామాపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ గానే ఉంటా. ఎంపీగా పోటీ చేస్తానని నేను ఎవరికీ విజ్ణప్తి చేయలేదు. ఢిల్లీ వెళ్లి ఎవరినీ కలవలేదు’ అని తెలిపారు. ‘ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు’ అని స్పష్టం చేశారు.
Also Read జగన్, షర్మిలపై ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర వ్యాఖ్యలు.. ఆ పార్టీలోనే చేరుతా?
‘నేనెప్పుడు ప్రజలతోనే ఉంటాను.. ఉండాలి అనుకుంటాను’ అని చెప్పి గవర్నర్ ముగించారు. తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు ఆమెపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని తేలింది. గవర్నర్ గా మరికొన్నాళ్లు తమిళిసై కొనసాగుతారని తెలుస్తోంది. 2019 నుంచి తెలంగాణ గవర్నర్ గా ఆమె పని చేస్తున్నారు.
ఆమె మాటలు వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి