Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు.. బెయిల్పై ఉత్కంఠ..!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటకీక పరిణామాల మధ్య సెప్టెంబర్ 9, శనివారం వేకువజామున సీఐడీ అధికారులు అయన్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలనే నిబంధన మేరకు ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు.
సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించి, సీఐడీ తరుపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టులో చంద్రబాబు తరఫున సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు.
ఆ తర్వాత కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. స్కిల్ డెవలప్ మెండ్ స్కామ్తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టులో వాడి- వేడిగా వాదనలు జరుగుతుండగా, బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. మరి ఇరు పక్షాల వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా అనేది చూడాలి.
ఇకపోతే అంతకుముందు, విచారణ ప్రారంభం సమయంలో తన చాంబర్లో విచారిస్తానని న్యాయమూర్తి సూచించారు. అయితే ఓపెన్ కోర్టులోనే విచారణ జరగాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది. దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.