AP Elections: మళ్లీ వైసీపీలోకి వంగవీటి ఫ్యామిలీ.. వ్యూహం అదేనా?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వలసలు ఊపందుకుంటున్నాయి. కొంతమంది తమ పార్టీలో టిక్కెట్ రాదంటే ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, కాపు సామాజిక వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న వంగవీటి తదితరులు వైసీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ: ఉపాధి వనరుల్లో ఏపీ సరికొత్త రికార్డు.. దేశంలో ఎన్నో స్థానమంటే?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణలు కాశీలో కలవడంపై మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా.. రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో పిండ తర్పణం చేసే సమయంలో రాధతో కొడాలి నాని ఉండడంతో రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఇందులో భాగంగానే వైసీపీలో ముఖ్య నాయకుడు, రాధకు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని ద్వారా వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు రాధాకృష్ణ వైసీపీలో చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ALSO READ: పవన్ కల్యాణ్కు కొత్త టెన్షన్.. ‘జనసేన’ పేరిట మరోపార్టీ!
వంగవీటి ఫ్యామిలీకి ఆఫర్.. నిజమేనా?
వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి రంగా అన్న కుమారుడు నరేంద్రకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, విజయవాడ తూర్పులో దేవినేని అవినాశ్ పోటీ చేసే అవకాశం ఉండడంతో.. విజయవాడ సెంట్రల్ నుంచి నరేంద్రను లేదా వంగవీటి రాధాకృష్ణను పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే.. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణు సైతం ఈ సారి పోటీ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి నరేంద్రను లేదా వంగవీటి రాధాకృష్ణను పోటీకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వంగవీటి ఫ్యామిలీ చేరిక కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఉండొచ్చని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమను మరో సారి బరిలోకి దించనుందని సమాచారం.