Sajjala: వైఎస్సార్ మృతి వెనుక కాంగ్రెస్.. షర్మిల వెనుక బాబు: సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కేంద్రంగా తీవ్ర చర్చ నడుస్తోంది. సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి. జగన్ ను ఓడించడానికి షర్మిలను రంగంలోకి దింపారని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా షర్మిల పరిణామంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మరణం విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
చదవండి: కూల్చేస్తాం.. పేల్చేస్తామంటే ఊకుంటామా? మంత్రి సీతక్క ఆగ్రహం
తాడేపల్లిలో శనివారం జరిగిన ఓ సమావేశంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ షర్మిల అంశంపై స్పందించారు. ‘షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. బ్రదర్ అనిల్ ను టీడీపీ నేతలు గతంలో ఎలా ఆరోపించారో చూశాం. ఇప్పుడు పక్కన నిలబడి అదే పార్టీ నేతలు ఫొటోలు దిగుతున్నారు’ అని తెలిపారు.
చదవండి: మనిషి గంభీరం కానీ బంగారం.. యువతి ప్రాణం కాపాడిన ‘యానిమల్’ నటుడు
‘వైఎస్సార్ సీపీ తొలి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకాను పోటీలో నిలిపింది. వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ తో చంద్రబాబు తెర వెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది. గెలుపు కోసం బాబు ఇలాంటి కుట్రలు తెర లేపుతున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.