AP Government: మరో మైలు రాయి.. ఎగుమతుల్లో ఏపీ పైపైకి!
వ్యవసాయ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతోపాటు గ్రామస్థాయిలో ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం కైవసం చేసుకుంది. దీని ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు భారీ ఎత్తున ఎగుమతులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యవసాయ రంగాలకు చెందిన అనేక ఉత్పత్తులను ఏపీ ఎగుమతి చేసినట్లు జాతీయ సంస్థ పేర్కొంది.
ALSO READ: సిట్టింగ్ల మార్పుతో మొదలైన రాజకీయం.. అసలు కారణమిదే?
నంబర్ వన్ మార్క్కు దగ్గరలో..
రాష్ట్రాలు సాధించిన ఎగుమతుల రికార్డులను ఆయా ఉత్పత్తుల ఆధారంగా కాకుండా.. ఎంత మేరకు సొమ్ము వచ్చిందనే విధానంపై ఆధారపడి కేంద్రం నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువరించిన ఇండియన్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ట్రేడ్ సంస్థ నివేదికలో ఏపీ ఎగుమతుల రంగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇదే ఊపు కొనసాగితే వచ్చే ఏడాది వరకు నంబర్ వన్ మార్క్ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడు మాసాల కాలంలో 10.42 శాతం ఉత్పత్తులను ఏపీ ఎగుమతి చేసినట్లు వివరించింది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం కేవలం 3.32 శాతంతో చాలా వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది.
ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ న్యూ ఈయర్ గిఫ్ట్ ఇదే..
తొలి స్థానంలో గుజరాత్..
వ్యవసాయ ఎగుమతుల రంగంలో గుజరాత్ తొలి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం ఏకంగా 16.29 శాతం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇక, రెండో స్థానంలో మహారాష్ట్ర 14.61 శాతం ఉండగా, మూడో స్థానంలో హర్యానా 10.61 శాతం వస్తువులను ఎగుమతి చేసినట్లు నివేదిక వివరించింది. ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నుంచి కేవలం 3.32 శాతం మాత్రమే ఎగుమతి అయినట్లు నివేదిక వివరించడం గమనార్హం. దీంతో మొత్తానికి ఏపీ ప్రభుత్వంపై అభివృద్ధి జరగడం లేదనే విమర్శలు చేస్తున్న వారికి ఈ ఫలితాలు షాకిచ్చాయనే చెప్పుకోవాలి.