AP Politics: లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం.. ముఖాముఖిలో జగన్
చంద్రబాబు హయాంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ మేరకు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర తుగ్గలికి చేరుకుంది. ఇక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిని జగన్ వివరించారు. అనంతరం ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. అనతరం ముఖాముఖి ముగియడంతో మేమంతా సిద్ధం యాత్ర మళ్లీ మొదలైంది.
ALSO READ: వైసీపీకి పెరిగిన సంఖ్యాబలం..మెజారిటీ ఓటర్లు ఏమన్నారంటే?
95 శాతం కుటుంబాలకు లబ్ది..
వైసీపీ అధికారంలోకి వచ్చిన 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి స్పష్టమైన మార్పులు తీసుకురాలేదన్నారు. తుగ్గలిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, తుగ్గలి, రాతన పరిధిలో 10 వేల జనాభా ఉందని, ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ, వైసీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయని, ఇప్పుడేమో తుగ్గలి అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 29.65 కోట్లు ఇచ్చామని.. రాతన గ్రామంలో 95 శాతం కుటుంబాలకు లబ్ది జరిగిందని స్పష్టం చేశారు.
ALSO READ: నాలుగోరోజుకు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
గాంధీజీ కలలు ఇవే..
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామని, వలంటీర్ల ద్వారా ప్రతీ పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం ఇస్తున్నామని, గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఇదేనని అన్నారు. దేశంలో రూ.3వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనేదే అని, ఆరోగ్యశ్రీని రూ.25లక్షలకు పెంచామన్నారు. రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు అండగా ఉన్నామని, విద్యావిధానంలోనూ మార్పు తీసుకొచ్చామని పేర్కొన్నారు. మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, అంతకుముందు పెంచికలపాడు నుంచి రాతన వరకు భారీ స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపిస్తూ జనం సీఎం జగన్కు అపూర్వ స్వాగతం పలికారు.
2 Comments