CM Jagan: ఇవాళ వాలంటీర్లకు నగదు పురస్కారాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలను వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే వారిని పలు అవార్డులు, నగదు సత్కారాలతో ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు నగదు పురస్కార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ఇవాళ సీఎం జగన్ నగదు పురస్కారాలు అందించి సత్కరించనున్నారు. అనంతరం అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఈ నెల 22 వరకు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
నగదు పురస్కారం భారీగా పెంపు
ALSO READ: పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఎక్కడుందో తెలుసా?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లకు ‘సేవావజ్ర’ అవార్డును అందిస్తారు. గతంలో ఈ నగదు పురస్కారం రూ. 30 వేలు ఉండగా ఈ ఏడాది నుంచి దానిని రూ. 45 వేలకు పెంచారు. ఇక మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన వారికి ‘సేవారత్న’ అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డు ద్వారా అందిస్తున్న నగదు బహుమతిని రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచారు. పనిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఫిర్యాదులు, వివాదాలు లేకుండా సేవలందిస్తున్న మిగిలిన వాలంటీర్లందరికీ ‘సేవామిత్ర’ అవార్డు ద్వారా అందిస్తున్న మొత్తాన్ని రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు.
పాలనలో వాలంటీర్లది కీలక పాత్ర
ALSO READ: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో, గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి, వాటి పరిష్కారంలో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వివరిస్తున్నారు. వరదలు, విపత్తుల సమయాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.