CM Jagan: నాలుగో ఏడాది కూడా.. త్వరలోనే వాలంటీర్లకు సత్కారం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం కీలకంగా మారింది. ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించడంతోపాటు సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు, ప్రభుత్వానికి వారధుల్లా సంక్షేమ పథకాలను అందిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి వందనం పేరుతో ఏపీ సర్కార్ సత్కరిస్తుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఈసారి సంక్రాంతికే అందజేయనుందని సమాచారం.
ALSO READ: ముమ్మరంగా సహాయక చర్యలు.. సీఎం జగన్ భరోసా
సంక్రాంతికే వాలంటీర్లకు అవార్డులు..
రాష్ట్రంలో కనీసం ఏడాదిపాటు సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందజేసే ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ ఏడాది ఉగాది కానుకగా అందించే ఈ అవార్డులను ఈసారి ముందస్తుగా ఇవ్వనుందని సమాచారం. వచ్చే ఏడాది మార్చి లేదా ఏఫ్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకే వాలంటీర్లకు అవార్డులు అందించే యోచనలో ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మంది వాలంటీర్లకు ఈ పురస్కారాలను ప్రదానం చేయగా.. పురస్కారాల కోసం ప్రభుత్వం రూ.258.74 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రూ. 243.34 కోట్లతో కలిపి ఇప్పటివరకు వాలంటీర్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం వెచ్చించింది.
ALSO READ: మిచౌంగ్ తుపాను.. తెలంగాణపై ఎఫెక్ట్
అవినీతికి తావు లేకుండా..
రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే వెళ్లి అందిస్తున్న వాలంటీర్ల సేవలకు గాను ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుగా మూడు కేటగిరిల్లో ఈ పురస్కారాలను అందిస్తుంది. ఈ మేరకు సేవా వజ్ర కింద రూ.30 వేలు, సేవారత్న కింద రూ.20 వేలు, సేవామిత్ర కింద రూ. 10 వేలు నగదు పురస్కారం అందించనుంది. కాగా, వీరంతా ఉద్యోగులుగా కాకుండా గౌరవ వేతనంతో అత్యుత్తమ సేవలందిస్తు అందరి మన్ననలు పొందుతున్నారు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయ కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొని ప్రజలను ఆదుకుంటున్నారు. తాజాగా, మిచౌంగ్ తుపాన్ బాధితులకు రేషన్ పంపిణీలో వలంటీర్ల వ్యవస్థ సమర్థవంతంగా చేపడుతోంది.