Cyclone Effect: మిచౌంగ్ తుపాను.. తెలంగాణపై ఎఫెక్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను మంగళవారం ఏపీలోని బాపట్ల వద్ద తీరం దాటింది. ఇక ఏపీ, తమిళనాడు తుపాను ప్రభావంతో అగమాగం అయ్యాయి. ఇక తెలంగాణపై కూడా మిచౌంగ్ ప్రభావం పడింది. ఉమ్మడి జిల్లాతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆంధ్ర ప్రదేశ్ లో తీరం దాటిన తీవ్ర తుపాను మిచౌంగ్ ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలహీనపడిన మిచౌంగ్ తీవ్ర తుపాను వాయుగుండంగా ఖమ్మంకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడే అవకాశం ఉందని ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also read: Kolkata: కోల్ కత్తా మరో రికార్డ్.. హైదరాబాద్ ఎక్కడంటే?
ఇక, మిచౌంగ్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది. మరో వైపు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. జేవీఆర్ ఓసీలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. లక్ష 80 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం కలిగింది.
వర్షానికి వరితో పాటు పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిళ్లడంతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.