Politics: పార్టీని నడిపే లక్షణాలు పవన్కు లేవు… సజ్జల కామెంట్స్
టీడీపీ, జనసేన ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా.. టీడీపీకి 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. కేవలం 24 సీట్లకే పవన్ కల్యాణ్ ఒప్పుకోవడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read: టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్.. జనసేనకు ఎన్ని స్థానాలంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను చూస్తే జాలేస్తోందన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోందని… పవన్ దయనీయంగా మారారని ఎద్దేవా చేశారు. జనసేనను మింగాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారన్నారు. ఈ సారి ఎక్కడ పోటీ చేయాలో కూడా ఆయనకు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ అనుబంధ విభాగంగా మారిందని టీడీపీకి పవన్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని సెటైర్ వేశారు. రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్కు లేవని విమర్శలు గుప్పించారు.
Also Read: ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం… అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు
జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా?. అలాగే, ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల కామెంట్స్ చేశారు. పవన్ కంటే ఆయన అభిమానులను చూస్తే జాలేస్తోందని… చంద్రబాబుకు ఎందుకు సపోర్టు చేస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడని విమర్శించారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా మాకు ఇబ్బంది లేదని… వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీదే ఘన విజయమని ధీమా వ్యక్తంచేశారు.