YS Sharmila: కడప ఎంపీగా షర్మిల పోటీ.. బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుండి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఉన్నప్పటికీ ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కడప ఎంపీ టికెట్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 8 రోజుల పాటు షర్మిల బస్సు యాత్ర సాగనుంది. ఈ మేరకు షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ ను కాంగ్రెస్ రిలీజ్ చేసింది.
Also read: Sumalatha: కాషాయం గూటికి ఎంపీ సుమలత.. ఎన్నికల్లో పోటీచేయనని వెల్లడి
కడప జిల్లాలోని అన్ని మండలాల ప్రజలతో కలిసే విధంగా ఈ షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 5న కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరంలో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభంకానుంది. ఆ తర్వాత 6న బద్వేల్, అట్లూరు, కడపలో బస్సు యాత్ర సాగనుంది .7న దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బి. మఠం, 8న కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లిలో షర్మిల ప్రచార యాత్ర సాగుతుంది.
ఆ తర్వాత 10న చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, 11న తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మీదుగా 12న జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు రాజుపాలెం చేరుకున్న తర్వాత షర్మిల కడప జిల్లా బస్సు యాత్ర ముగియనుంది. కాగా, ఇప్పటికే జగన్ మీద ఘాటైన విమర్శలు గుప్పిస్తున్న షర్మిల ఈ ప్రచారంలో భాగంగా ఏ రేంజ్ లో విమర్శల దాడి చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.