Vasantha Panchani Special: వసంత పంచమి విశిష్టత ఏంటో తెలుసా?
ఇవాళ వసంత పంచమి అంటే చదవుల తల్లి సరస్వతీ మాత పుట్టినరోజు. ఈ రోజు సరస్వతీ దేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని నమ్ముతారు. వసంత పంచమి (శ్రీపంచమి అని కూడా అంటారు) రోజున సరస్వతీ దేవిని ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ఇవాళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానరాశులు అవుతారని ప్రతీతి. ఆ చదువుల తల్లి ఆరాధనతో వాక్శుద్ధి, జ్ఞానాభివృద్ధి, సత్బుద్ధి, మేధా సంపద, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ… తదితర శుభాలు కలిగి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారని విశ్వాసం. వాగీశ్వరీ, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణాసరస్వతి, బాల సరస్వతి రూపాల్లో చదువుల తల్లిని తెల్లనిపూలతో పూజించడంతో సకల విద్యలు నేర్చుకుంటారని పురాణ వచనం. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న సరస్వతీ దేవి ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బాసర, వర్గల్ (తెలంగాణ), భీమ్పుల్ (ఉత్తరాఖండ్), పుష్కర్ (రాజస్థాన్), సరస్వతీ దేవీ మందిర్ (కశ్మీర్) తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
‘బాసర’ ఎంతో ప్రత్యేకం
ALSO READ: నేడే వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
భారతదేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కశ్మీరులో ఉండగా, రెండవది బాసర అని చెపపుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరారు. ఈ మందిరాన్ని చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులును ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలం నివసించాడని, కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర, కాలక్రమంలో ‘బాసర’ గా నామాంతరాన్ని సంతరించుకుందని ప్రతీతి. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.