Naa Saami Ranga: వినోదాత్మకంగా ’నా సామిరంగ‘ ట్రైలర్.. సంక్రాంతికి నాగార్జున గట్టిపోటీనే
మరోసారి సంక్రాంతి పండుగకు సినీ ప్రేక్షకులను అలరించేందుకు అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’తో వస్తున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా’ అని అల్లరి నరేశ్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. నాగార్జున మరోసారి కుటుంబ కథా చిత్రంతో వస్తున్నాడని ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది.
Also Read షాకింగ్ లుక్ లో నటి సురేఖవాణి.. శ్రీవారికి తలనీలాలు
ఈ సినిమాలో అల్లరి నరేశ్ ‘అంజి’ పాత్రలో నటిస్తుండగా.. మరో పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. నాగ్ సరసన ఆషికా రంగనాథ్ అందంగా కనిపించింది. ‘పాతికేళ్ల కిందట ప్రభల వెళ్లకుంటే వరదలు వచ్చాయని.. ఈసారి కిట్టయ్య వచ్చాడని అందరూ చెప్పుకుంటారు’ అంటూ నాగార్జున డైలాగ్ తో అలరించాడు. ‘నోట్లో రెండు యాలక్కాయలు వేసుకొని రమ్మంటావేంటి?’ అంటూ హీరోయిన్ తో నాగ్ చేసే సరసాలు ప్రేక్షకులకు వినోదం అందించనున్నాయి. ‘కిట్టయ్యకు నరకడం తెలుసు కానీ.. సరసం ఎట్ల తెలుస్తది’, ‘కిష్టయ్యనే ఎయ్యాలంటే సావుకు ఎదురెల్లాలి’ వంటి సంభాషణలు అలరిస్తున్నాయి. ‘సాయంత్రం ప్రభల తీర్థం అయ్యిన తర్వాతపోయి తెగిన తలలు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టుకో’ అని హీరోయిన్ ఆషిక్ పౌరుషంతో కిట్టయ్య గురించి చెప్పడం ఆకట్టుకుంది.
Also Read బాలకృష్ణ ఓటమే లక్ష్యం.. హిందూపురంపై YSRCP పకడ్బందీ వ్యూహం
రౌడీ విసిరిన గడ్డపారకు కింగ్ నాగార్జున నోటితో బీడీ వెలిగించుకోవడం ట్రైలర్ లోనే హైలెట్ సీన్. ఈ ట్రైలర్ ను చూస్తే 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమానే గుర్తుకు వస్తుంది. ట్రైలర్ వినోదాత్మకంగా ఉండడంతో ఈసారి సంక్రాంతి పండుగ విజేత నాగార్జునే అని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో పవన్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎ కీరవాణి సంగీతం అందించగా.. డీఓపీ శివేంద్ర దాశరథి, డైలాగ్ లు ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదలకు సిద్ధమైంది.