AP Elections: 35 ఏళ్ల పాలనలో కుప్పానికి ఏమైనా మంచి జరిగిందా?
కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ అని, ప్రజల గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేక మోసం చేసే చంద్రబాబు కావాలా? అని సీఎం జగన్ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెలుబెట్టుకొని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ALSO READ: కుప్పంపై జగన్ ముద్ర.. చంద్రబాబుకు ఎదురుగాలి!
ప్రజల సహనానికి జోహార్లు..
కుప్పానికి కృష్ణమ్మ నీరు, మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ అన్నారు. చంద్రబాబును 35ఏళ్లు భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు తెలిపారు. చంద్రబాబు 35 ఏళ్ల పాలనలో కుప్పానికి ఏమైనా మంచి జరిగిందా? అసలు ఇప్పటివరకు ఇక్కడ సొంత ఇళ్లు అయినా కట్టుకున్నాడా? కేవలం రాజకీయం, ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో మాట కలుపుతున్నాడని ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు.. పులివెందులను, కడపతోపాటు రాయలసీమను తిడుతూ ఉంటాడు. కానీ, మీ బిడ్డ ఏనాడూ కూడా ఒక్క మాట అనలేదు. పైగా గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నామని తెలిపారు.
ALSO READ: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. సీఎం కీలక నిర్ణయం
చంద్రబాబుకు పొత్తులెందుకు?
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క స్కీమ్ అయినా గుర్తు వస్తుందా? అందుకే కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు.. ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల వచ్చేసరికి రంగుల మేనిఫెస్టోతో వచ్చి ప్రజలను మభ్యపెట్టి వదిలేసే చంద్రబాబు మనకెందుకు? అన్నారు. ఒకవేళ మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? అన్నారు. రానున్న ఎన్నికల్లో భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి.. భరత్ గెలిచిన తర్వాత మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.