Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల ఏవీఏఎన్ ఇన్ఫ్లూఎంజా వైరస్ తో కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయని తెలిసి, స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ALSO READ: కొనసాగుతున్న ‘భారత్ బంద్’
కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని చికెన్ సెంటర్లు, కోళ్ల ఫారాలను మూడు రోజుల పాటు మూసివేయాలని కలక్టర్ ఎం. హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా చూడాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఏదైనా కారణంతో కోళ్లు చనిపోతే భూమిలో పాతి పెట్టాలని, అంతేతప్ప చెత్తకుప్పల్లో పడేయరాదని కోరారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా నిర్వహించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.