AP: దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం: సీఎం జగన్.. ‘జగనన్న తోడు’ నిధులు విడుదల
దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ‘జగనన్న తోడు’ పథకం 8వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
Also Read మమతా బెనర్జీ రికార్డు జగన్ కే సాధ్యమా..? ఏపీ ఎన్నికల్లో అదేనా జరిగేది..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జగనన్న తోడు పథకం ద్వారా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, అంతకుపైన కలిపి రూ.417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు అందిస్తున్నామని వివరించారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం జగన్ చెప్పారు.
Also Read ఎంపీ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. యువ నాయకుడు రాజీనామా
‘మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం’ అని సీఎం జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భారీ లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు.
సామాజిక సాధికారత సాధించిన జగనన్న తోడు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం జగన్ చెప్పారు. మిగతా రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందని ప్రకటించారు. ఇదంతా వలంటీర్ వ్యవస్థ ద్వారా సాధ్యమైందని స్పష్టం చేశారు.