War: ఇజ్రాయిల్ పై 5 వేల రాకెట్లతో యుద్ధం.. బిక్కుబిక్కుమంటున్న జనం
పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్లోకి ప్రవేశించి తీవ్ర అలజడి సృష్టించారు. డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించడంతో ఓ మహిళ మరణించిందని అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఇక ఇజ్రాయిల్ లో యుద్ధ స్థితి ప్రకటించడంతో పాటు, ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలోనే అనేక మంది ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడ్డారని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. జెరూసలేంలో వైమానిక దాడి సైరన్లతో గాజా నగరం అతలాకుతలం అవుతోంది.
సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన దృశ్యాలు, పలు చిత్రాలు వైరల్ అవుతుండగా.. అందులో ఇజ్రాయిల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్లో యూనిఫాం ధరించి ముష్కరులను పోలి ఉండే కొందరు కనిపించారు. కొన్ని వీడియోలలో కాల్పుల శబ్దం కూడా వినబడుతోంది. తెల్లవారుజామున అరగంటకు పైగా సాగిన ఈ దాడులు గాజాలో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెల్ అవీవ్ వరకు వినిపించాయి. గాలిలో రాకెట్ల శబ్దాలు వినిపించాయి.
ఏ క్షణమైనా పూర్తి స్థాయి యుద్దానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. అయితే ఎంతమంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం హమాస్, ఐడీఎఫ్ మధ్య భీకర పోరు నడుస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. ఈ సమయంలోనే మహాస్ గ్రూప్ ఆఫ్ మహమ్మద్ డీఫ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఆపరేషన్ అల్ అక్సా పేరుతో తెల్లవారుజామున ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లను ప్రయోగించినట్టు ప్రకటనలో తెలిపారు.