Ongole: వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా
ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని… ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలకు పోటీ చేశానని తెలిపారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని చెప్పారు.
Also Read: బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
వైఎస్ఆర్సీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదన్నారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read: రైతుల ఖాతాల్లో మూడో విడత పెట్టుబడి సాయం.. ఇది ఐదోసారి!
భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఇటీవల పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని.. అనివార్య పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని వీడాల్సి వస్తోందని తెలిపారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీని రాజీనామా చేసిన వారిలో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు, నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యులు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.