Bengaluru Court: మాజీ సీఎం జయలలిత బంగారం వారికే.. బెంగళూరు కోర్టు సంచలన తీర్పు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన 27 కేజీల బంగారం, వజ్రాభరణాలను ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు 36వ సిటీ సివిల్ కోర్టు ప్రకటించింది. మార్చి 6,7న రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్ప గిస్తామని తెలిపింది.
Also read: Mangalagiri: సొంతగూటికి వచ్చేస్తోన్న సీనియర్ ఎమ్మెల్యే.. ఆయనకేనా టికెట్?
జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ ముద్ర వేశారని అందరికీ తెలిసిందే. అయితే అవినీతి కేసులో దోషిగా తేలడంతో నాలుగేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. మళ్లీ సీఎం కావడం.. పదవిలో ఉండగానే మరణించారు. ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేసే అంశం ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉంది. ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురానుంది. సుమారు 20 కిలోల నగలను అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానా వసూలు చేయనుండగా, 7 కిలోలు ఆమె తల్లి నుంచి వారసత్వంగా వచ్చినవిగా భావించి మినహాయింపు ఇస్తారు. జయలలితకు ఖాతా ఉన్న కాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సోమవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు రూ.60 లక్షలను అందజేసింది.
తాము గతంలో ఆదేశించిన విధంగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ (డీవీఏసీ) ఇన్ స్పెక్టర్ జనరల్ బెంగళూరు కోర్టుకు వచ్చి బంగారు, వజ్రాభరణాలు స్వీకరించాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 16న జీవో జారీ చేసింది. ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, అవసరమైన భద్రతతో ఆరు పెద్ద ట్రంకులను తీసుకురావాలని న్యాయమూర్తి చెప్పారు. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు.